హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 5.06 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్టు గుర్తించిన ఎన్నికల సంఘం.. వారికి ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించడంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం ఒకటి చొప్పున మొత్తంగా 21,686 వీల్చైర్లను అందుబాటు లో ఉంచింది.
ఓటుహక్కు వినియోగించుకునే దివ్యాంగులకు సాయం చేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నది. వీరికి ప్రత్యేక రంగు టీషర్ట్లు అందిస్తున్నారు. వినికిడిలోపం ఉన్న ఓటర్లతో సంభాషించేందుకు వీలుగా పోలింగ్ సిబ్బందికి పిక్టోగ్రామ్ చార్ట్లను పంపిణీ చేశా రు. కంటి చూపులేని ఓటర్లకు బ్రెయిలీ లిపిలో ముద్రించిన ఓటరు స్లిప్పులను అందించడంతోపాటు 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను బ్రెయిలీలో ప్రింట్ చేశారు. రాష్ట్రంలో 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగ సిబ్బందితో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.