హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందా? అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులను గాలికొదిలేసిందా? అంటే తాజా గణాంకాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రేవంత్రెడ్డి సర్కార్ చేసిన అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోయి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది చాలదన్నట్టు ప్రభుత్వం తాజాగా మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రూ.2,540 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో 19 ఏండ్ల కాలపరిమితితో 7.75% వార్షిక వడ్డీకి రూ.540 కోట్లు, 28 ఏండ్ల కాలపరిమితితో 7.70% వడ్డీకి రూ.1,000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో 7.69% వడ్డీకి మరో రూ.1,000 కోట్లు తీసుకున్నది.
దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి తెచ్చిన మొత్తం అప్పు రూ.85,840 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న రూ.54,009 కోట్ల వార్షిక రుణ సమీకరణ లక్ష్యం కంటే 58.93% అధికం. నిరుడు ఇదే సమయానికి తెచ్చిన మొత్తం అప్పుల కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. గత ఐదేండ్ల్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయి. 2022-23లో వార్షిక బడ్జెట్ అంచనాలో కేవలం 61 శాతానికే పరిమితమైన రుణాలు.. ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.
రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరుగకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఇతర ఖర్చుల కోసం పూర్తిగా మారెట్ రుణాలపైనే ఆధారపడుతున్నది. అలా అంచనాలకు మించి అడ్డగోలుగా తెస్తున్న అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీలు భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాకు పెనుభారంగా మారడం, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
