హనుమకొండ సబర్బన్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10: తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉత్తమ పనితీరులో మరోసారి సత్తా చాటాయి. ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసియేషన్ (ఐపీపీఏ) అవార్డుల్లో ఏకంగా ఆరింటిని కైవసం చేసుకున్నాయి. వీటిలో ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)కు 4, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు 2 లభించాయి. కర్ణాటకలోని బెల్గాంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన విద్యుత్తు రెగ్యులేటరీ, పాలసీ మేకర్స్ రిట్రీట్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
డిస్కంను అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న ఎన్పీడీసీఎల్కు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్ క్యాటగిరీ అవార్డుతోపాటు 2/1 ఎంవీఎఆర్ కెపాసిటర్ బ్యాంక్స్, 600 కేవీఎఆర్ లైన్ కెపాసిటర్లను భారీ సంఖ్యలో ఎత్తున అమర్చి విద్యుత్తును ఆదా చేసినందుకు.. సౌరశక్తిని అందిపుచ్చుకోవడం ద్వారా ఉత్పత్తి ఖర్చును తగ్గించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నందుకు.. ఇటు సంస్థకు, అటు వినియోగదారునికి నష్టం వాటిల్లకుండా ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్ను అమలు చేస్తున్నందుకు మొత్తం 4 అవార్డులు అందజేశారు. అదేవిధంగా బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ క్యాటగిరీలో అత్యుత్తమ అవార్డును కైవసం చేసుకున్న ఎస్పీడీసీఎల్.. బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టు ప్రమోట్ కన్స్యూమర్ అవేర్నెస్ క్యాటగిరీలో మరో అవార్డును గెలుచుకున్నది. దీనిపై రెండు డిస్కంల సీఎండీలు గోపాల్రావు, జీ రఘుమారెడ్డి, అధికారులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. తమ సిబ్బంది సహకారం, అంకితభావంతోనే ఈ అవార్డులు లభించాయని తెలిపారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని అవార్డులు సాధించాలని సూచించారు.