హైదరాబాద్/సుల్తాన్బజార్/వరంగల్/కొత్తగూడెం అర్బన్/ఆసిఫాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మూడు నెలలుగా వేతనాలు అందక ఒక పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సి వస్తున్నదని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు, కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్వో కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టరేట్ల ఎదుట నిరసన కొనసాగింది.
ఈ నెల 11న భద్రాచలంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కోఠిలోని ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేంద్రం నుంచి నిధులు రాగానే జీతాలు చెల్లిస్తామని ఎన్హెచ్ఎం డైరెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా నాయకులు రామస్వామి, జైపాల్రెడ్డి, సెకండ్ ఏఎన్ఎం యూనియన్ రాష్ట్ర కోశాధికారి పద్మ, తెలంగాణ ప్రభుత్వ పల్లె దవాఖాన వైద్యుల సంఘం నాయకులు పాల్గొన్నారు.