హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్పై రిజర్వాయర్ మేనేజ్ మెంట్కమిటీ (ఆర్ఎంసీ) చేసిన సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది. ఇరు రాష్ర్టాలు రూల్ కర్వ్స్కు అంగీకారం తెలిపాయని ఆర్ఎంసీ కన్వీనర్ ఏకపక్షంగా మీడియాకు తెలపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇందుకు నిరసనగా సోమవారం జరిగిన ఆర్ఎంసీ సమావేశాన్ని బహిష్కరించింది. శ్రీశైలం ప్రాజెక్టు ముమ్మాటికీ జలవిద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టేనని పునరుద్ఘాటించింది.
విద్యుత్తు ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరదజలాల మళ్లింపు తదితర అంశాలపై మొదటి నుంచీ వినిపిస్తున్న వాదనలకే తెలంగాణ ఇప్పటికీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ సోమవారం ఘాటైన లేఖ రాశారు. ఈ నెల 3న జరిగిన ఆర్ఎంసీ సమావేశంలో రూపొందించిన ముసాయిదా సిఫారసులను తెలంగాణ, ఏపీ మధ్య జరిగిన ఒప్పందంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా ఆర్ఎంసీ కన్వీనర్ ఉద్దేశపూర్వకంగా మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. మెంబర్ కన్వీనర్ ప్రకటనలు ‘సత్యదూరం, అభ్యంతరకరం’ అని స్పష్టం చేశారు. ప్రతిపాదిత ముసాయిదాలోని ఏ ఒక్క అంశానికీ తెలంగాణ ఆమోదం తెలుపలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ముసాయిదా సిఫారసులను నిలుపుదల చేయాలని, వాస్తవాలపై మెంబర్ కన్వీనర్ మీడియాకు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఇరు రాష్ర్టాలు 50ః50 నిష్పత్తిలో పంచుకోవాలని ఆర్ఎంసీ ప్రతిపాదించడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్తు ఉత్పత్తి కోసమే నిర్మించారని, ఇదే విషయాన్ని బచావత్ ట్రిబ్యునల్ సైతం స్పష్టం చేసిందని గుర్తుచేసింది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును 50ః50 నిష్పత్తిలో పంచుకోవాలనే ప్రతిపాదనకు తాము ఒప్పుకోబోమని, కానీ తాము ఒప్పుకున్నట్టుగా వక్రీకరిస్తున్నారని తెలిపింది.
ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా మాత్రమే ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ఉండాలని, అందుకు విరుద్ధంగా రూపొందించేవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ స్పష్టం చేసింది. కానీ సీడబ్ల్యూసీ అందుకు విరుద్ధంగా రూల్కర్వ్స్ను ప్రతిపాదించి తెలంగాణకు ద్రోహం తలపెట్టిందని మండిపడింది. బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం రిజర్వాయర్ ఎండీడీఎల్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదని గుర్తుచేసింది. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకొనేందుకు ఏపీకి అనుమతివ్వాలని ఆది నుంచీ డిమాండ్ చేస్తున్నామని, కేఆర్ఎంబీ, ఆర్ఎంసీకి అనేకసార్లు విన్నవించామని గుర్తుచేసింది. అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించి, తెలంగాణ 66ః34 నిష్పత్తికి ఒప్పుకున్నట్టు ప్రచారం చేయడం తగదని ఆక్షేపించింది.
మిగులు జలాల నిర్ధారణపైనా తెలంగాణ తన వాదనలను మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టులన్నీ నిండిన తరువాత వృథాగా దిగువకు పోకుండా మళ్లించుకునే మిగులు జలాలను లెక్కించవద్దనే ప్రతిపాదనలను నిర్దంద్వంగా తోసిపుచ్చింది. కృష్ణా నుంచి మళ్లించుకునే ప్రతి నీటి చుక్కనూ లెక్కించాల్సిందేనని విస్పష్టంగా తేల్చి చెప్పింది. నీటిని మళ్లించుకునే, నిల్వ చేసుకునే సామర్థ్యం ఏపీకి చాలా ఎక్కువగా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో స్పిల్ ఓవర్ సమయంలో మళ్లించిన నీటిని కూడా ఏపీ వాటా కింద లెకించాలని, లేకుంటే మళ్లీ ఉమ్మడి స్టోరేజీల నుంచి నీటిని కోరుతూ అధిక మొత్తంలో కృష్ణా జలాలను వినియోగించుకునే అవకాశమున్నదని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా జలాలను 50ః50 నిష్పత్తిలోనే వినియోగించుకుంటామని తెలంగాణ మరోసారి పునరుద్ఘాటించింది. ఇదే విషయాన్ని కేఆర్ఎంబీ 16వ సమావేశంలో స్పష్టంగా తెలియజేశామని గుర్తుచేసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ గతంలో మాదిరిగా 66ః34 నిష్పత్తిలోనే వినియోగించుకోవాలని నోటీసులు జారీ చేయడాన్ని తెలంగాణ తప్పుబట్టింది. కృష్ణా బోర్డుకు అలాంటి అధికారాలు లేవని, కేవలం ఇరు రాష్ర్టాలు ఆమోదించిన వాటిపైనే కేఆర్ఎంబీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఆర్ఎంసీ రూపొందించిన ముసాయిదా సిఫారసులపై ఏపీ ప్రభుత్వం సంతకం చేసింది. తెలంగాణ వాదనలకు పూర్తి విరుద్ధంగా ఆర్ఎంసీ తన నివేదికను రూపొందించింది. ఇదే విషయమై శనివారం కొనసాగిన సమావేశంలో ఇరు రాష్ర్టాలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై మరోసారి చర్చించేందుకు సమావేశాన్ని ఆర్ఎంసీ సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఏకాభిప్రాయం కుదరకముందే ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిైళ్లె మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీశైలం ఆపరేషన్ ప్రొటోకాల్ కొలిక్కి వచ్చిందని, ఇరు రాష్ర్టాలు అంగీకరించాయని ఏకపక్షంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ తీరును తప్పుబడుతూ తెలంగాణ రాష్ట్రం సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఏపీ మాత్రం సమావేశానికి హాజరుకావడంతోపాటు, ఆర్ఎంసీ నివేదికపై సంతకం చేసింది.