హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade celebrations) సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తున్నదని, ప్రజా సహకారంతో ఒక ఉద్యమంలా కార్యక్రమం కొనసాగుతున్నదని సీఎం తెలిపారు.
హరితహారం గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలు నాటించింది. దాంతో 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతం ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో చదరపు కిలోమీటర్కు 2,549గా ఉండగా.. ప్రస్తుతం అది 2,848కి పెరిగింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది’ అని సీఎం చెప్పారు.
‘ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే పార్కులు అంతగా అందుబాటులో ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా వాటి నిర్వహణ సరిగా జరిగేది కాదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఒక నర్సరీతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. సుమారు లక్ష కిలోమీటర్ల పొడవున రహదారి వనాలు పూర్తిచేయించింది. అందుకే ఇప్పుడు ఏ రోడ్డు వెంట వెళ్లినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు తెలంగాణ పొలిమేరల్లోకి రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను చూసి పులకించి పోతుండటం మనకు గర్వకారణం. పట్టణాల్లో రూ.700 కోట్ల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేశారు. హరితహారం ఇచ్చిన సత్ఫలితాలతో మన హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా రెండుసార్లు గుర్తింపు పొందింది’ అని ఆయన తెలియజేశారు.
‘వచ్చే వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే జూన్ 19వ తేదీన హరితోత్సవాన్ని జరుపుకుందాం. అందులో భాగంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, రహదారుల వెంట, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో అన్ని చోట్లా, అడుగడుగునా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమంలో ఆబాల గోపాలం భాగం పంచుకోవాలి. హరితహారంలో భాగంగా ప్రభుత్వం ఫల సాయం ఇచ్చే మొక్కలతోపాటు, తాటి, ఈత మొక్కలను కూడా పెద్ద సంఖ్యలో నాటి గీత కార్మికుల ఉపాధికల్పనకు దోహదం చేస్తున్నది. ఇలాంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదు. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచేందుకు జరుగుతున్న అతి పెద్ద మానవ మహా ప్రయత్నంగా తెలంగాణకు హరితహారం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
హరితనిధి ఒక నవీన ఆలోచన
‘ప్రపంచంలో మరెక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేసింది. ఇందులో, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు వీరందరిని హరితనిధిలో భాగస్వాములను చేసింది. వీరి నుంచి సమీకరించిన మొత్తంతో హరిత నిధి ఏర్పాటయ్యింది. నూతన పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలలో స్థానిక సంస్థలు తమ బడ్జెట్ లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికై ఖర్చు చేయాలని నిబంధనను పొందుపర్చింది. ఈ విధానం అద్భుతమైన ఫలితాలను సాధించింది. హరితనిధికి నోడల్ ఏజెన్సీగా అటవీశాఖ వ్యవహరిస్తున్నది’ అని సీఎం వెల్లడించారు.