Telangana Decade Celebration : ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు. కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం ప్రారంభించారని, ఈ పథకం అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు. అదే ఉత్సాహంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హరితోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయి నుంచి, మండలం, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలకు అనుగుణంగా తొమ్మిదో విడత హరితహారాన్ని ప్రారంభించి, ముమ్మరం చేయాలని సూచించారు. సమావేశంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ హరితహారం విజయాలపై ప్రచారం చేయాలన్నారు. ప్రజల్లో మరింతగా పర్యావరణ స్పృహ పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
రాష్ట్ర మంతటా పరుచుకున్న పచ్చదనం, ప్రతీ గ్రామంలో వెలిసిన నర్సరీలు, ప్రకృతి వనాలు, రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అటవీ పునరుద్ధరణ ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఇవే విజయాలను పోస్టర్లు, వీడియోల ద్వారా ప్రదర్శించాలని తెలిపారు. 19న రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు.
పిల్లల్లో పర్యావరణ స్పృహ పెరిగేలా అయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులకు సూచించారు. సాగునీటి శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో ప్రత్యేక హరితోత్సవం నిర్వహించాలన్నారు. గ్రామాలు, మండలాల్లో కొత్తగా మొక్కలు నాటే ప్రాంతాలకు దశాబ్ది వనాలుగా నామకరణం చేయాలని సూచించారు. 19న రాష్ట్రవ్యాప్తంగా జరిగే మొక్కల నాటే కార్యక్రమం కోసం పెద్ద మొక్కలు, ప్లాంట్ మెటీరియల్ సిద్ధం చేయాలని, అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. సమావేశంలో అన్ని జిల్లాల అటవీ అధికారులు, గ్రామీణ అభివృద్ధి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.