Congress | హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదయ్పూర్ డిక్లరేషన్ కాకరేపుతున్నది. తాము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమకే చుట్టుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిరుడు మే నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నవ్సంకల్ప్ చింతన్ శిబిర్ను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్’ కాగా, జంపింగ్ జపాంగ్లకు టికెట్ ఇవ్వకూడదన్నది రెండోది. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వడం. అలాగే, పార్టీలో కనీసం ఐదేళ్లు ఉన్నవారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి టికెట్ నిరాకరించాలని నిర్ణయించారు. ఇప్పుడీ రెండు నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నాయి. ముందుచూపు లేకుండా అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ అగ్రనేత రాహుల్గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా టికెట్లు ఇద్దామంటే ఉదయ్పూర్ డిక్లరేషన్ అడ్డం వస్తున్నదని, కాదని ముందుకెళ్తే ప్రజల్లో చులకన అయిపోతామని నేతలు తలలు పట్టుకుంటున్నారు.
గాంధీభవన్లో మంగళవారం జరిగిన ఎన్నికల కమిటీ భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య ఇదే డిక్లరేషన్ చిచ్చుపెట్టింది. ఉత్తమ్కుమార్, జానారెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, అంజన్కుమార్ యాదవ్ సహా పలువురు నేతలు ఒకటికంటే ఎక్కువ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా పార్టీ కోసం సేవ చేస్తున్నారని, కాబట్టి వారికి కూడా టికెట్లు ఇవ్వాలని వీరంతా పట్టుబడుతున్నారు. దీనిని మరో వర్గం తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకే కుటుంబానికి రెండుమూడు టికెట్లు ఇస్తే మిగతా వారి పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ న్యాయం జరిగేలా ఒకే కుటుంబానికి ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ్కుమార్, ఆయన భార్య పద్మావతి రెండు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ టికెట్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని మహేశ్గౌడ్ కోరగా.. స్పందించిన ఉత్తమ్ ఇప్పుడీ విషయంలో చర్చ ఎందుకని, ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారని ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోక్యం చేసుకున్న రేవంత్ ఈ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పడంతో ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని, హైకమాండ్కు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనను డిక్టేట్ చేయవద్దంటూ ఉత్తమ్పై రేవంత్ ఫైరయ్యారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఉదయ్పూర్ డిక్లరేషన్ ఇప్పుడు చెత్తకాగితంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము రూపొందించిన డిక్లరేషన్ను తామే అమలు చేయలేని స్థితిలో ఉన్నామని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంశంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుండగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాచూట్ నేతలకు టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం డిక్లరేషన్కు తూట్లు పొడవక తప్పదని వాపోతున్నారు. ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి సుధాకర్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చంద్రశేఖర్తోపాటు పలువురు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో చేరకున్నా రేఖానాయక్ కూడా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.