Congress | కరీంనగర్, జూలై 22: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆ పార్టీ పెద్దల తీరుపై అలకబూనినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు స్థానం లభించక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అధిష్ఠానాన్ని కలిసి తాడో పేడో తేల్చుకొనేందుకు ఆదివారం పొన్నం వర్గీయులు హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకోవడం ఇందుకు బలా న్ని చేకూరుస్తున్నది. పార్టీలో తన వాణిని గట్టిగా వినిపించే పొన్నం, ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలోపోతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు ప్రాధాన్యం లభిస్తుందని ఆశించినా మొండిచెయ్యి చూపడం ఆయనకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.
కాంగ్రెస్లో బీసీ నాయకులను అణగదొక్కుతున్నారనే వాదనకు తమ నాయకుడే ఉదాహరణ అని పొన్నం వర్గం రగిలి పోతున్నది. ఆదివారం హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు థాక్రేను, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసి నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధిష్ఠానం వద్దకు వెళ్లి తమ నాయకుడికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని, ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో పెత్తనం చేస్తున్న నాయకుల భరతం పడతామని పొన్నం ప్రధాన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.