Kavita : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలువడం ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు.
దీనిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. డిజైన్ మార్చకపోయినా, ఆయకట్టు పెంచకపోయినా టెండర్లను ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రధాని మోదీతో కేసీఆర్కు సత్సంబంధాలు లేకనే ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన ప్రధానితో సత్సంబంధాలు పెట్టుకొని జాతీయ హోదా సాధించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో అన్నసాగర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డి కోర్టు కేసులతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసినా.. తాగునీటి ప్రాజెక్టు కాబట్టి ఆపకుండా రిజర్వాయర్లను పూర్తిచేశామన్నారు.
ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని, తద్వారా జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందని కవిత సూచించారు. రీటెండర్లంటూ కాలయాపన చేస్తే మరో రెండు పంటలకు నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. త్వరగా పనులు పూర్తిచేస్తే వచ్చే వర్షకాలంలో నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఏపీ సర్కారు సంగమేశ్వరం వద్ద రాయలసీమ ప్రాజెక్టును నిర్మించే ధైర్యం చేయలేదని, అనుమతిలేని రాయలసీమ ప్రాజెక్టును కేసీఆర్ ఆపారని, రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టును కొనసాగించకుండా చూడాలని కోరారు.
పక్కనే కృష్ణా నది ఉన్నా కూడా పంటలు పండక ఇక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చబడాల్సిందేనన్న సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పనిచేశారని కవిత చెప్పారు. కృష్ణా జలాలను శాశ్వతంగా పాలమూరుకు మళ్లించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి ‘ఏనుగు ఎల్లింది.. తోక చిక్కింది’ అన్నట్లుగా ఉందని చెప్పారు. 69 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు ఉన్నాయని, కాలువల పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని, నార్లాపూర్లో కేసీఆర్ ట్రయల్ రన్ను కూడా ప్రారంభించారని తెలిపారు.
మొత్తం ప్రాజెక్టులో కేవలం 10 శాతం పనులే మిగిలి ఉన్నాయని, అవి పూర్తి చేసుకుంటే మరో 10 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందే ఆస్కారం ఉందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా వంటి ప్రాజెక్టులను పూర్తిచేసి మంచి నీటి కొరత లేకుండా చేశామని, 11 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించామని తెలిపారు. వివిధ కారణాల రీత్యా ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక అడుగు వెనుకకుపడితే పది అడుగులు ముందుకు లంకించేంత శక్తి ఉంటుందని, గుండె ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.