CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్కు వెలుపల, రీజినల్ రింగ్ రోడ్కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవి విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని ఆయన తెలిపారు. అంతేకాదు, పరిశ్రమలకు సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకాని భూములై ఉండాలని స్పష్టంచేశారు. దీనివల్ల, రైతులకు నష్టం కలుగకుండా ఉండడంతోపాటు కాలుష్యం తకువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేవిధంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి డా.బీ.ఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలసి సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాలైన తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, అందులో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారని, ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ముఖ్యంగా కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. , హైదరాబాద్లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేరొన్నారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై కూడా సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. .