Mallikarjun Kharge | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ)ః కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు. ప్రధాని మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని, దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మాయమాటల్లో పడకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉన్నదని చెప్పారు. సంక్షోభంలో ఉన్నప్పుడే మోదీకి పాకిస్తాన్, చైనా, దేవుడు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ జాతీయ నాయకులతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు హాజరై లోక్సభ ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దేశంలోనే ఒక మాడల్ కావాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించేందుకు రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారని వివరించారు.
ఫిబ్రవరి నెలాఖరుకల్లా రైతులు అందరికీ రైతు భరోసా సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రకటించామని గుర్తుచేశారు. ఫిబ్రవరిలో మరో రెండు హామీలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇకనుంచి తాను రోజు విడిచి రోజు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తీరుతామని చెప్పారు.
పార్టీ కార్యకర్తలు రాహుల్గాంధీని ప్రధాని సీట్లో కూర్చొబెట్టే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్సేనని, ప్రాణత్యాగాలకు వెరవకుండా పనిచేసింది నెహ్రూ కుటుంబమేనని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు మధుయాష్కీ, షబ్బీర్ అలీ తదితరులు ప్రసంగించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీ తదితరులు హాజరయ్యారు.