హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వంతోపాటు అందరికీ న్యాయం అందాలనే రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరూ సగర్వంగా వేడుకలు జరుపుకోవాలని, రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హకుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. తమ ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. అధికారం చేపట్టిన మొదటిరోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తున్నదని స్పష్టం చేశారు.