CS Shanti Kumari | ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆమె ఆదివారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ దాదాపు పదివేల మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని చెప్పారు. సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు.
ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ ఈ నెల తొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలలోపే ఎల్బీ. స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను శాంతి కుమారి ఆదేశించారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను హైదరాబాదుకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. జిల్లా నుండి వచ్చే బస్సులకు వేదికకు సమీపంలోనే తగు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను స్టేడియం సమీపంలోనే దించే విధంగా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్కు సూచించారు. నగరంలో వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రెయిన్ ప్రూఫ్ షామియానా వేయాలని అన్నారు.
ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అంద చేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.