(కంధార్ – లోహా నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయవంతంగా కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచే సభకు వెళ్లేందుకు గ్రామాల్లో సందడి నెలకొన్నది. రైతులు సద్దులు కట్టుకొని మరీ ద్విచక్ర వాహనాలపై సభకు కదిలిరాగా, ఆటోలు, బస్సుల్లో ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో సభా ప్రాంగణంతోపాటు యావత్ లోహా తాలూకానే మార్మోగిపోయింది. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని సభికులు ఆద్యంతం ఆసక్తితో ఆలకించారు. ప్రసంగ సమయంలో కేసీఆర్ పంచులకు ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఈలలతో సభను హోరెత్తించారు.
బీఆర్ఎస్ బహిరంగ సభకు విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలనుంచి జనం తరలిరాగా, లోహ పట్టణంలోని బైల్ బజార్ కిక్కిరిసిపోయింది. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న నాందేడ్లో ఫిబ్రవరి 5న నిర్వహించిన తొలిసభకు మించి రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒక్క లోహ పట్టణంలోనే దాదాపు 20 నుంచి 30 వేల జనాభా ఉండగా, అందులో యువకులు, స్థానికులు, వ్యాపారులతోపాటు దాదాపు అన్ని వర్గాల వారు సభకు కదిలివచ్చారు. దాదాపు సభకు 70 వేల మందికిపైగా జనం తరలివచ్చారు. లోహ పట్టణం గులాబీమయమైంది. ప్రధాన రహదారులన్నీ గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో కళకళలాడాయి.
లోహలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభపై మరాఠా పల్లెల్లో ఉదయం నుంచే సందడి నెలకొన్నది. పర్భణి, లాతూర్, నాందేడ్ లోకసభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఊరూరా సభపై చర్చ కొనసాగింది. కంధార్, లోహ, కన్నాడ్, పర్భణి, దెగ్లూర్, పూర్ణ, గంగాఖేడ్, ముద్ఖేడ్, పత్రి, పాలా, చందోలి, చౌక్, మన్వర్, అహ్మదాపూర్, ధర్మాబాద్, బిలోలి, పాలెం, మస్రా, సుభాశ్నగర్తోపాటు ఇతర నియోజకవర్గాలు, తాలూకాలకు గులాబీ నినాదం పాకింది. రైతులు, యువకులు ద్విచక్రవాహనాలకు బీఆర్ఎస్ జెండాలను కట్టుకొని ఒక్కొక్కరుగా సభకు తరలివచ్చారు. మహిళలు సైతం చంటిపిల్లలతో సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చంద్రాపూర్, షోలాపూర్ నుంచి పలువురు నేతలు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా సభకు చేరుకోవడం అందరినీ ఆకర్షించింది.
నాందేడ్లోని కంధార్ లోహాలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో మార్మోగిపోయింది. లోహా సభా ప్రాంగణమే కాదు యావత్ తాలూకానే దద్దరిల్లిపోయింది.
కేసీఆర్ సభా వేదికకు చేరుకోగానే కర్షకులు, ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కూర్చున్న సీట్ల నుంచి పైకి లేచి వినమ్రపూర్వకంగా జేజేలు పలికారు. ‘దేశ్ కీ నేతా కైసా హో.. కేసీఆర్ జైసా హో’.. ‘కేసీఆర్ తుమ్ ఆగే బడో.. హమ్ తుమ్హారే సాథ్’..‘జయహో కేసీఆర్.. జయహో భారత్.. జై బీఆర్ఎస్’ నినాదాలతో కర్షకులు, కూలీలు హోరెత్తించారు. చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. సభా ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ ప్రచార రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరాఠీ భాషలో డిజిటల్ డిస్ ప్లే ద్వారా వీడియోలతో సహా వివరించగా, సభకు తరలివచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ పథకాలను తెలుసుకొని వేనోళ్ల ప్రశంసించారు. ఆ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు జరుగాలని ఆకాంక్షించారు.