Telangana | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): నేడు, రేపు (సోమ, మంగళవారం) రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో సోలాపూర్, దారశివ్ జిల్లాల్లో పర్యటించనున్నారు. పండరీపూర్లోని విఠలేశ్వరాలయం, దారశివ్ జిల్లాలోని తుల్జాభవాని అమ్మవారి దర్శనం కోసం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో తెలంగాణకు ఉన్న ఆత్మీయ బంధంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సాంస్కృతిక ధార వారసత్వంగా కొనసాగుతున్నది. మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం సోలాపూర్ జిల్లాలోని పండరిపూర్ విఠలేశ్వరాలయాన్ని సందర్శించుకోకున్నారు. వైష్ణవ సంప్రదాయానికి దక్షిణభారతం ఆలవాలంగా కొనసాగుతున్నది. అలాగని శైవ సంప్రదాయం తక్కువస్థాయిలో ఏమీలేదు. భక్తిఉద్యమ ప్రభావానికి మహారాష్ట్రకు విడదీయరాని అనుబంధం ఉన్నది. వారారీలు విఠలేశ్వర్ స్వామిని పూజిస్తారు. జ్ఞానేశ్వర్, నామ్దేవ్, చోఖమే లా, ఏకనాథ్, తుకారాం, గాడ్గే మహారాజ్ లాంటి ఎంతోమంది వారారీల సంప్రదాయాన్ని అనుసరించారు. సంఘంలో అందరూ సమానులే, కులాలకు, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని వార్కారీ సంప్రదాయం ప్రబోధించింది. పండరిపూర్లోని విఠలేశ్వరుని ప్రభావంతో భక్తిఉద్యమ ప్రవక్తలుగా ఎంతో మంది ఎదిగారు.
సోలాపూ ర్ జిల్లా చంద్రభాగనది ఒడ్డున ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విఠలేశ్వరాలయానికి ప్రత్యేకత ఉన్నది. దేశం లో తొలి విఠోబా దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు లక్షలాది మంది విఠలేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ విఠలేశ్వరాయాన్ని దక్షిణకాశిగా భక్తులు కొలుస్తారు. సాం స్కృతిక పరంగానే కాకుండా భాష పరంగా తెలుగు, మరాఠీకి అవినాభావ సంబంధం ఉన్నది. పోర్గీ, పో ర్గా(పోరి, పోరడు) లాంటి అనేక మరాఠీ పదాలు తెలుగుభాషతో మమేకమయ్యాయి. పండరి, పండరీనాథ్, ఏక్నాథ్, విఠల్, పాండురంగ, పాండు, విఠలేశ్వర్, జ్ఞాన్దేవ్, నామ్దేవ్, తుకారం లాంటి పేర్లు తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి సమీపం లో పాండురంగ ఆశ్రమం నెలకొన్నది. ఆచార వ్యవహారాల్లో.. భక్తి ఆచరణలో..దేవుని కొలుపులో తెలంగాణలో విఠలేశ్వరుడు సమ్మిళితం కావటం విశేషం.
దేశానికి ఆర్థిక రాజధాని ముంబై నిర్మాణంలోనే కాదు.. ప్రస్తుతం ఆ నగర ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉన్నది. 1932లో పుణెలోని భండారర్ ఓరియంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహాభారత ప్రచురణకు డబ్బు కావాల్సివస్తే ఎవరూ ముందుకు రాని సమయంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖా న్ ఆర్థికసాయం చేశారని మహారాష్ట్ర చరిత్రకారులు గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. నిజాం నవాబు ఏడాదికి రూ.1000 చొప్పున 11 సంవత్సరాలపాటు ఆర్థిక సహాయం చేశారని భండార్కర్ ఓరియంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్రంథాల్లో పొందుపరచింది. అలాగే అక్కడ నిజాం అతిథి గృహాన్ని నిర్మించేందుకు ఆ రోజుల్లోనే రూ.50 వేలు ఖర్చుచేశారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు మహారాష్ట్రతో తెలంగాణకు విడదీయరాని సంబంధం ఉన్నది.
దేశంలో చేనేత పరిశ్రమలో సోలాపూర్ది ప్రత్యేకస్థానం. నిజాం కాలంలో వరంగల్లో నెలకొల్పిన అజంజాహి మిల్లు, ఆదిలాబాద్లోని సర్సిల్క్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో తెలంగాణలో చేనేత రంగం అతిపెద్ద ఉపాధినిచ్చే పరిశ్రమగా అవతరించింది. స్వాతంత్య్రానంతరం ఈ రెండు ప్రాంతాల్లోని నిష్ణాతులైన చేనేతకార్మికులు ఈ రంగంలో ఉపాధిని వెతుక్కుంటూ సోలాపూర్, భీవండి, సూరత్ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది చేనేత కార్మికులు సోలాపూర్ వస్త్ర పరిశ్రమలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. దేశంలో అనేక ప్రాంతాల్లో చేనేత రంగంలో ఉన్న నేత కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు రావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. సోలాపూర్లోనూ అనేక సభలు.. సమావేశాలు జరిగాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు, కవులు, కళాకారులు అనేక మంది సోలాపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ అనంతరం సోలాపూర్ నుంచి నేతకార్మికుల బృందం వచ్చి సీఎం కేసీఆర్ను కలిసిం ది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు పూర్వవైభవం కల్పిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని సోలాపూర్, సూరత్, భీవండి తదితర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణీయుల స్థితిగతులతోపాటు వస్త్రపరిశ్ర మ తీరుతెన్నులను అధ్యయనం చేయటానికి పంపించారు. ఆ పరిణామాల నేపథ్యంలోనే వరంగల్లో దేశంలో భారీ వస్త్ర పరిశ్రమను (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) ప్రభుత్వం నెలకొల్పింది. ఫాం టు ఫ్యా షన్ విధానంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే అనేక కంపెనీలు తమతమ కార్యాకలాపాలను వరంగల్లో ప్రారంభించాయి. మొత్తానికి ఆర్థికంగా..సాంస్కృతికంగా మహారాష్ట్రతో మనబంధం పడుగు..పేకలుగా పెనవేసుకున్నది. అలాగే రాజకీయంగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో మహారాష్ట్ర భాగ్యరేఖగా నిలుపుతామని బీఆర్ఎస్ వాగ్దానం చేస్తున్నది.
మహారాష్ట్ర, తెలంగాణ భౌగోళికంగా రెండు రాష్ర్టాలు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వపరంగా మహారాష్ట్ర, తెలంగాణ అనాది నుంచి జమిలీగా సాగుతున్నాయి. దక్కన్ పీఠభూమిలోని బలమైన నిజాం రాజ్యంలో మరాఠ్వాడా భాగమే. ఈ ప్రాంతం ఔరంగాబాద్, బీడ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్బణీ జిల్లాల సమాహారం. ‘తెలంగాణకు మహారాష్ట్రకు అనేక అంశాల్లో చాలా దగ్గరి బంధం ఉన్నది. అది రోటీ భేటీ సంబంధం’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలి నాందేడ్ సభలో ఉదహరించిన విషయం తెలిసిందే.
తెలుగువారికి ప్రతి మాసం ఎంతో విశేషమైనది. ప్రస్తుతం ఆషాఢమాసం. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాలుగవది. అమ్మవారి ఆరాధానకు ఆషాఢమాసం శ్రేష్ఠమైనది. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు, శుభాలనిచ్చే ఇతర కార్యక్రమాలు తలపెట్టరు. గృహనిర్మాణాలు చేపట్టరు. కానీ, ఆధ్యాత్మికంగా ఆషాఢం అత్యంత శక్తివంతమైన మాసం. వైష్ణవ క్షేత్రాల్లో ఏపీలోని తిరుమల ఎంతటి ప్రసిద్ధి చెందిందో మహారాష్ట్రలోని పండరీపురం అంతటి ప్రాముఖ్యత కలిగినది. భీమా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం సోలాపూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వి ఠోబా పేరుతో పూజలందుకుంటున్నాడు. విఠోబా లేదా వితోబా అనే పేరు పురాణాల్లో ఉన్నది.
దేశంలోని పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్ర పండరీపురంలో కొలువై ఉన్న పాండురంగడు. పండరీపు రం విఠేశ్వరాలయంలో శుద్ధ ఏకాదశికి, కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొత్తం ఏకాదశుల్లో తొలిది. అంటే ప్రథ మ ఏకాదశి. ఇలాంటి రోజు రాత్రి వైష్ణవాలయా ల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. ఆభరణా లు, జాజిపువ్వులతో విష్ణు విగ్రహాన్ని పూజిస్తారు. పవళింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడుతారు. చంద్రభాగ నదీ తీరాన పండరీపురంలో కొలువైన విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలంటారు. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయనైక ఏకాదశి అని కూడా అంటారు. పండరీపురంలోని శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది.