హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో దేశంలో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పేరుతో రూ.12 లక్షల కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తే హాహాకారాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కార్పొరేట్లకు లక్షలకోట్లు మాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
భారతదేశంలో ఒకే పార్టీ ఉంటదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అంటున్నారని, ఇదేనా టీం ఇండియా స్ఫూర్తి? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నాశనం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని ప్రకటనలు చేస్తున్నారని, ఏ ధైర్యంతో బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. క్రియకు ప్రతిక్రియ తప్పకుండా ఉంటదని హెచ్చరించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశంలో చర్చ కోసమే నీతి ఆయోగ్ బహిష్కరణ
ఢిల్లీలో రైతులు 13 నెలలపాటు ధర్నా చేస్తే చివరకు ప్రధానే దిగివచ్చి క్షమాపణ చెప్పి వివాదాస్పద చట్టాలను విరమించుకున్నరు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎన్ని రోజులైంది? ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినయ్.. అంతే వారు అటు. వీరు ఇటు. ఇప్పటివరకు మళ్లీ మాట ముచ్చట లేదు. రైతు సంఘాలను పిలిచిందీ లేదు. మద్దతు ధర ప్రకటించిందీ లేదు. పన్నుల విధింపుపై కూడా నీతి ఆయోగ్లో చర్చించరా? దేని మీద విధించాలో? దేని మీద విధించకూడదో చెప్పరా? పాలమీద పన్ను.. చచ్చిపోతే పన్ను.. గుజరాత్లో ఆఖరికి గార్భా డ్యాన్స్ చేస్తే కూడా పన్ను ఏస్తున్నారు. గాలి మీద తప్ప అన్నింటి మీద పన్ను వేశారు. ఇది సహకార ప్రజాస్వామ్యమా? అందుకే నేటి నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. దేశం మొత్తం దీనిపై చర్చించాలని, కనీసం ప్రధాని అయినా వీటిపై పునఃసమీక్షిస్తారని ఆశించి బహిష్కరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పనితీరులో ఇకనైనా పరివర్తన రావాలె.
జాతిపితను దూషించే దేశం ఎక్కడైనా ఉన్నదా?
ఏ దేశంలో కూడా జాతిపితను అవమానించిన దుస్థితి లేదు. ఏ దేశమైనా తన చరిత్రను తానే మలినం చేసుకుంటుందా? దేశంలో బీజేపీ సర్కారు మాత్రం అదే చేస్తున్నది. ఆటవికంగా, అనాగరికంగా వ్యవహరిస్తున్నది. గాంధీని పూజించేవాళ్లు దేశంలో ఎంతోమంది ఉన్నారు? గాంధేయవాదులమని చెప్పుకొని గర్వపడేవారు కోట్లమంది ఉన్నరు. ప్రధాని ఏమో నీతి ఆయోగ్ లోగో మీద గాంధీ కళ్లద్దాలు పెడతారు. బీజేపీకి సంబంధించిన అనేక శాఖలు మాత్రం గాంధీని ఇష్టారాజ్యంగా దూషించుకుంటూ, తుపాకీతో కాల్చుకుంటూ, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నరు. గాంధీని హతమార్చిన వాళ్లను పూజిస్తున్నరు. లేని దుర్లక్షణాలను గాంధీకి అంటగడుతున్నారు?
12 లక్షల కోట్ల కుంభకోణం
ఇప్పుడు కేంద్రం కొత్త పాట మొదలు పెట్టింది. ఉచితాలు బంద్ జేయాల్నట. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా? బాధలో ఉన్న రైతాంగానికి రైతుబంధు, రైతుల కుటుంబాలు రోడ్డున పడకుండా రైతు బీమా ఇవ్వటం ఉచితాలా? అసలు ఉచితాలు ఏంటి? అనుచితాలు ఏంటి? మరి ఎన్పీఏలు ఎందుకు ఇస్తున్నరు. దేశంలో 2004-05లో రూ.55 వేల కోట్ల ఎన్పీఏలు ఉండే. 2014లో రూ.2. 63 లక్షల కోట్లు. ఆ పదేండ్లలో పెరిగిన ఎన్పీఏల విలువ కేవలం 1.90 లక్షల కోట్లు. ఇప్పుడున్నది రూ. 20 లక్షల కోట్లు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇదో దందా. ప్రభుత్వంలోని పెద్దలు, కార్పొరేట్లు కూడబలుక్కొని, లక్షల కోట్లు కమీషన్లు తీసుకొంటున్నరు. ఇదో పెద్ద కుంభకోణం. ఇప్పటికే రూ.12 లక్షల కోట్లు ఇచ్చిండ్రు. నీతి ఆయోగ్ బృహత్తరమైన ఆలోచనలు అవలంభిస్తే ఎన్పీఏలు తగ్గాలి కదా? మరెందుకు పదింతలు పెరిగాయి? ఇది మీ పనితనానికి నిదర్శనమా? లేదంటే మీరు చేస్తున్న కుంభకోణమా?
నాడు మేధోసంపత్తి.. నేడు పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి
మేకిన్ ఇండియా అంటున్నారు. మరి పతంగులు ఎగరేసే మాంజా, దీపావళి దివ్వెలు, బ్లేడ్లు, నెయిల్ కట్టర్లు కూడా చైనా నుంచే వస్తయా? మొబైల్ ఫోన్లు, పీపీఈ కిట్లు, జాతీయ పతాకాలు కూడా చైనా నుంచి రావడమే మేకిన్ ఇండియానా? దిగుమతులు తగ్గాలా? పెరగాలా? ఇండియా భూభాగం 83 కోట్ల ఎకరాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని అద్భుతమైన సదుపాయం ఇండియాకు ఉన్నది. 60 శాతం వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉన్నది. కానీ, ఇవాళ కూడా ఇండియా కందిపప్పు దిగుమతి చేసుకొంటున్నది. 1.45 లక్షల కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకొంటున్నది. ఇదా నీతి ఆయోగ్ మేధో సంపత్తి? కేంద్ర దుర్మార్గ పాలసీలు, కార్పొరేట్ అనుకూల వైఖరి వల్లే నూనె గింజలు పండించాల్సిన రైతులు ఢిల్లీలో నెలల తరబడి ధర్నాలు చేస్తున్నరు. మొదటగా ఇండియా నుంచి మేధో సంపత్తి అంతా బయటకు వెళ్లిపోయింది. ఇవాళ పెట్టుబడులు తరలిపోతున్నాయి. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలో హరించుకుపోతున్నాయి అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.