హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ సిద్దిఖీ ముకర్రంజా బహదూర్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లోని చౌమొహల్లా ప్యాలెస్లో పార్థివదేహాన్ని సందర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబసభ్యులను ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ సలీం తదితరులున్నారు.
ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్కు పార్థివదేహం
ఎనిమిదో నిజాం ముకర్రంజా పార్థివదేహం హైదరాబాద్కు మంగళవారం చేరుకున్నది. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని శంషాబాద్కు తీసుకొచ్చారు. అకడి నుంచి చౌమొహల్ల్లా ప్యాలెస్కు తరలించారు. మంగళవారం నిజాం కుటుంబీకులు, బంధువులను మాత్రమే పార్థివదేహాన్ని చూసేందుకు అనుమతిచ్చారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలు ముకర్రంజా పార్థివదేహాన్ని సందర్శించవచ్చు. అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది.
చౌమొహల్లా ప్యాలెస్ నుంచి మకామసీదు వరకు అంతిమయాత్ర కొనసాగనున్నది. తన పూర్వీకులైన నిజాం సమాధుల పకనే ముకర్రంజా పార్థివదేహాన్ని ఖననం చేస్తారు. ఇప్పటికే మక్కా మసీదులో తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. నిజాం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మ్యూజియాలు, విద్యాసంస్థలకు నిజాం సంస్థానం అధికారులు సంతాప సూచకంగా శుక్రవారం వరకు సెలవులు ప్రకటించారు. ముకర్రంజా బహదూర్ (మీర్ బర్కత్ అలీఖాన్) (89) శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
చివరి చూపునకు తరలిన నిజాం బంధువర్గం
ముకర్రంజా చివరి చూపు కోసం వివిధ దేశాల్లో ఉన్న నిజాం బంధువర్గం హైదరాబాద్కు తరలివచ్చింది. లండన్లో నివసిస్తున్న ముకర్రంజా సోదరుడు మీర్ కరమత్ అలీ ముఫకంజా బహదూర్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. జా తనయులు ప్రిన్స్ అజ్మత్జా, షేక్యార్, నిలోఫర్ ఎలిఫ్జా, అజమ్ఖాన్ నగరానికి చేరుకున్నారు. ముకర్రంజా భార్య ఎస్రా.. అంత్యక్రియల ఏర్పాట్లు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. ముకర్రంజా మృతి పట్ల ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. విద్య, వైద్యంలో ఈ ప్రాంతానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన మరణం వారసత్వ ప్రేమికులకు తీరనిలోటని తెలిపారు.