హైదరాబాద్ : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ – అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు తప్ప మరొకటి కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిమనీష్ సిసోడియాను ఢిల్లీ కోర్టు సీబీఐ (CBI) కస్టడీకి ఇచ్చింది. ఆయన మార్చి 4 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case)లో సిసోడియాను విచారించిన సీబీఐ.. ఎనిమిది గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఉప ముఖ్యమంత్రిని సీబీఐ హాజరుపరిచింది. ఆ తర్వాత సిసోడియాను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఎందుకు సిసోడియా రిమాండ్ అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సిసోడియాను ఇంకా విచారించి, వివరాలు రాబాట్టాల్సి ఉందని తెలిపారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) స్పందించారు. బీజేపీ అవలంభిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలన ఉపయోగించుకుంటున్నారన్న దానికి ఇదో ఉదాహరణ అని, దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇది కఠోరమైన అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ఇలాంటి అణచివేత మన దేశం పునాదిని దెబ్బతీస్తుంది, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.