హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఓఎల్ఎక్స్ ద్వారా మోసగించిన నిందితుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. 2016లో హ్యూందాయ్ వెర్నా కారును అమ్ముతానంటూ ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో వినోద్కుమార్ అనే వ్యక్తి దుబాయ్ పౌరుడిగా, అల్-హుస్సేన్ పేరుతో ప్రకటన ఇచ్చాడు.
హైదరాబాద్కు చెందిన సయ్యద్ అద్నాన్ నజీబ్ దానిని కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నాడు. రూ.3.50 లక్షల కారును రూ.93,200కు వినోద్ బేరం పెట్టాడు. డబ్బు చేతికి అందిన తర్వాత, కారు ఇవ్వకుండా వినోద్కుమార్, అతని స్నేహితుడు మహేశ్ ఉడాయించడంతో సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చార్జిషీటు వేయగా, వారు కోర్టుకు హాజరువడం లేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్ ఈ కేసును ఎన్బీడబ్ల్యూ ఎస్పీ రాంరెడ్డికి అప్పగించారు. ఆయన బృందం ఢిల్లీకి వెళ్లి నిందితుడు వినోద్కుమార్ అలియాస్ అల్-హుస్సేన్ను అరెస్టు చేసి, కోర్టుకు అప్పగించారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఏడీజీ మహేశ్ భాగవత్ అభినందించారు.