CS Shanti Kumari | వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైక్య సంఘాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వన మహోత్సవం, మహిళాశక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, వ్యవసాయ సంబంధిత అంశాలు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహనిర్మాణం తదితర అంశాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్, సెర్ప్ సీఈఓ దివ్య, మున్సిపల్ శాఖ డైరెక్టర్ గౌతమ్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో సరిపడ మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఇటీవలి కాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు నాణ్యమైన మొక్కలను నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. నాటిన ప్రతీ మొక్క ను జియోటాగింగ్ చేయడంతో పాటు వాటి మనుగడకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో 100 శాతం ఖాళీ స్థలాలు కవర్ అయ్యే విధంగా మొక్కలు నాటేందుకు జిల్లాలోని సీనియర్ అధికారులు దత్తత తీసుకోవాలని సూచించారు. ప్లాంటేషన్ సైట్లను జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైక్య సంఘాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్న నిర్ణయం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. స్వయం సహాయక బృందాలలో ఇప్పటికీ చేరని మహిళలందందరినీ చేర్పించాలని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ల తయారీ పనులను సకాలం లో పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. రెండో సెట్ యూనిఫామ్ ల పనులను కూడా త్వరలోనే పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్ ల ఏర్పాటు ను త్వరితగతిన ప్రారంభమయ్యేలా చొరవ చూపించాలన్నారు. ఇంకా అసంపూర్తిగా గా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను రెండు వారాల్లో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
గతేడాది ఇప్పటి వరకూ 44 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా ప్రస్తుత వానా కాలం సీజన్ లో ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని సీఎస్ శాంతి కుమారి అన్నారు. అన్ని మండలాల్లో సరిపడా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటి పంపిణీని జిల్లా కలెక్టర్లు ప్రతీ రోజూ పర్యవేక్షించాలని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో రైతు భరోసా సదస్సులను నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులకు ఆయా జిల్లాలోని రైతులు, రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ప్రస్తుత వర్షాకాల సీజన్ లో అతిసార, డెంగ్యూ, మలేరియా, చికన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఈ వ్యాధుల ఆనవాళ్లు కన్పించిన జిల్లాల్లో మరింత అప్రమత్తతతో ఉండాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో 24 / 7 పనిచేసే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలన్నారు.
ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈనెల 20 లోగా ఎట్టి పరిస్థితిలోనూ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 49 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఒక్కో పాఠశాల ఏర్పాటుకు కనీసం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూసంబంధ వివాదాల పరిష్కారం కోసం అందిన దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని ఆమె చెప్పారు.