యాదాద్రి భువనగిరి, మార్చి 11 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉదయం గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం అంకురారోహణం, విష్వక్సేనారధన, రక్షాబంధనం చేపట్టారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం మృత్సంగ్రహణం నిర్వహించారు. ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 21 వరకు వేడుకలు కొనసాగనున్నాయి.
బ్రహోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి దంపతులతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరయ్యారు. హెలికాప్టర్ ద్వారా గుట్టకు చేరుకున్న వారంతా రోడ్డు మార్గంపై కొండపైకి చేరుకున్నారు. సీఎంతోపాటు మంత్రుల బృందానికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం మంత్రులతోపాటు ప్రధానాలయానికి చేరుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి సతీమణితో కలిసి స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. వేదపండితులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి పాలొన్నారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి, యాదాద్రి డీసీపీ రాజేశ్చంద్ర నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదగిరిగుట్ట ఆలయ బ్రహ్మోత్సవాల తొలిరోజున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల పర్యటన నేపథ్యంలో భక్తులకు నాలుగు గంటలపాటు దర్శనాలు నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాతే వారికి దర్శన భాగ్యం కల్పించారు. బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిత్య, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేశారు. మంగళవారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీ పూజ, దేవతాహ్వాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.