Telangana | కవాడిగూడ/హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం ‘మహాలక్ష్మి’ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే రాజీవ్ ఆరోగ్యశ్రీ (చేయూత) పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. శనివారం అసెంబ్లీ వేదికగా మహిళామంత్రులు కొండా సురేఖ, సీతక్క, సీఎస్ శాంతికుమారి, మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులతో కలిసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జారీ చేసే జీరో చార్జీ టికెట్ను, ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులు ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చింది. అనంతరం బస్సులో ఉన్న మహిళా మంత్రులు, మహిళా అధికారులు, జర్నలిస్టులు, మహిళా నేతలకు జీరో టికెట్ అందించిన రేవంత్.. ట్యాంక్బండ్ వరకు బస్సులో ప్రయాణించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు మాణిక్రావు ఠాకూర్, పలువురు ఎమ్మెల్యేలు, రవాణాశాఖ సెక్రటరీ వాణీప్రసాద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల్లో మరొకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ(చేయూత) కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులను పెంచే పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు అని అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నదని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. మహిళలు ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని వివరించారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్కు రూ.2 కోట్ల ప్రోత్సాహక చెక్ అందజేశారు.
ఆరోగ్యశ్రీ పథకం వివరాలు