హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిలో మిగులు జలాలే లేవని చెప్తూనే, మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరితో అనుసంధానం సరికాదని స్పష్టం చేసింది. మహానది నుంచి జలాలను గోదావరికి తీసుకొచ్చిన తర్వాతే కావేరికి మళ్లించాలని తెగేసి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ)కి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ ఘాటుగా లేఖ రాశారు. ఇటీవల నిర్వహించిన 15వ బోర్డు సమావేశంలో గోదావరి-కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ చేసిన పలు ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆయా అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. 75 శాతం డిపెండబిలిటీ మీద గోదావరిలో మిగులు జలాలు ఏమీ ఉండబోవని కేంద్ర జలసంఘం, ఎన్డబ్ల్యూడీఏ నిర్ధారించాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు తిరిగి దాని ఆధారంగానే గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనలు రూపొందించడం ఏమిటని నిలదీశారు. ముందుగా మహానది నుంచి జలాలను గోదావరిలోకి మళ్లించిన తరువాతనే కావేరికు తరలించాలని, అప్పటివరకు గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టేందుకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచి చేపడతామని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించడాన్ని కూడా తీవ్రంగా ఆక్షేపించారు. ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు చేశారని, అయితే ముంపు ఎక్కువగా ఉంటుందని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయని గుర్తుచేశారు.
ఇప్పుడు కూడా ఆయా రాష్ర్టాలు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ప్రతిపాదిత ఇచ్చంపల్లి డ్యామ్ నిర్మాణ ప్రాంతం సమ్మక్క బరాజ్కు దిగువన కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నదని, ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మిస్తే సమ్మక్క బరాజ్కు ముంపు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమ్మక్క బరాజ్ దిగువన మొత్తంగా 158 టీఎంసీల వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిందని, దేవాదుల, సీతారామ, సమ్మక్క బరాజ్లను చేపట్టిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గోదావరి నుంచి జలాల మళ్లింపు చేపడితే ఆయా ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ నీటి అవసరాలు తీరిన తరువాతే మిగులు జలాలను మళ్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.