Telangana | హైదరాబాద్ : జీవో నంబర్ 58, 59 కింద ఇంటి స్థలాల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్తో కూడిన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సమావేశమైంది.
ఈ సందర్భంగా జీవో 58, 59 కింద పేదల ఇండ్ల స్థలాల పంపిణీ అంశంపై చర్చించింది. ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను సబ్ కమిటీ ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి, ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. జీవో 58, 59 కింద దరఖాస్తులకు కటాఫ్ గతంలో 2014 ఉండేదని, మరింత మంది పేదలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ ఆ కటాఫ్ను 2020కి పెంచారని గుర్తు చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హకులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పేరొన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి, ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.