హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశమవనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీకానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్పై మంత్రివర్గం చర్చించి, ఆమోదం తెలుపనున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే.
కాగా, మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ బయట నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరువుతారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ పయనమవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సచ్ఖండ్బోడ్ మైదాన్ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనం కానున్నారు.