హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో ఈ సమావేశం ప్రారంభమైంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభం రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్పై సమీక్షించి అవసరమైన సూచనలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.