హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. ఈనేపథ్యంలో కేబినెట్ సమావేశమైంది.
సోమవారం అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా బడ్జెట్ అంశాలపై చర్చ జరుగనున్నది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తున్నది. ఏటా సాధారణంగా జరిగే.. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం మళ్లీ జూన్ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. కేంద్ర గ్రాంట్ను తగ్గించే ప్రయత్నం గతంకంటే ఈ సారి బడ్జెట్లో సుమారు రూ.20 వేల కోట్ల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. నిరుడు 2023-24లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.