Telangana Cabinet Meeting | తెలంగాణ నుంచి కాశీ, శబరిమల వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయా పుణ్యక్షేత్రాల్లో రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్రావు ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు. మన దగ్గరి నుంచి కూడా చాలామంది భక్తులు కాశీకి వెళ్తుంటారు. కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుందని, స్వర్గానికి వెళ్తారని హిందువులందరికీ విశ్వాసం ఉంటుంది.
రాష్ట్రం నుంచి కాశీయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్న నేపథ్యంలో కాశీలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఒక వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. కాశీలో నిర్మించే వసతి గృహానికి రూ.25కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్యలు వేగంగా జరిగేందుకు గౌరవ మంత్రుల బృందం, చీఫ్ సెక్రెటరీని వీలైనంత త్వరగా కాశీ పర్యటన జరిపి.. అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, స్థలం దొరక్క పోతే ప్రైవేటు స్థలమైనా కొని రూ.25కోట్లతో అన్ని వసతులతో సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రత్యేక దినాల్లో రాష్ట్రం నుంచి వెళ్లిన భక్తులకు అక్కడ వసతులు లేక చాలా మంది ఇబ్బందులుపడుతున్నారు. రాష్ట్రం నుంచి కాశీ వెళ్లే భక్తులకు మంచి సౌకర్యాలతో కూడిన వసతి సముదాయాన్ని కాశీ పుణ్యక్షేత్రంలో నిర్మించాలని నిర్ణయించారు’ హరీశ్రావు తెలిపారు.
‘రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు కేరళలోని శబరిమల్ల అయ్యప్పస్వామి దర్శనానికి పెద్ద ఎత్తున వెళ్తుంటారు. ఎంతో నిష్ట, భక్తితో అయ్యప్ప భక్తులు ఉపవాస దీక్షను నిర్వహిస్తూ వస్తుంటారు. శబరిమలకు వెళ్లిన సమయంలో కూడా రాష్ట్రం నుంచి వెళ్లిన భక్తులకు ఇబ్బంది జరుగుతున్నది. అక్కడ సైతం రూ.25కోట్లతో శబరిమలలో రాష్ట్రం తరఫున వసతి గృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్ను ముందు వెళ్లి.. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని.. వెంటనే ప్రభుత్వం నుంచి స్థలాన్ని పొందాలని, ఆ తర్వాత మంత్రుల బృందం వెళ్లి అక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది.
గతంలోనే కేరళ సీఎంతో సీఎం కేసీఆర్ మాట్లాడితే స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. దాన్ని సమన్వయం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకొని భవన నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. ముందుకు తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్లో పేదల కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దళితుల కోసం దళితబంధు, గిరిజనుల కోసం పోడు భూముల పట్టాల పంపిణీ, పేదల వర్గాల కోసం 4లక్షల డబుల్ డబ్రూం ఇండ్లు కట్టే కార్యక్రమం, 58-59 జీవోలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం’ అని హరీశ్రావు వివరించారు.