హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మత్తు పదార్థాల దందాపై రాష్ట్ర ప్రభు త్వం యుద్ధం ప్రకటించింది. రాష్ట్రం నుంచి మత్తు మహమ్మారిని తరిమేసేందుకు ఇప్పటికే సమరశంఖం పూరించిన సీఎం కేసీఆర్.. శనివారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచేందుకు క్యా బినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కం ట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో వివిధ క్యాటగిరీల్లో నూతనంగా 3,966 పోస్టులను మంజూరు చేసింది. వీటిని వెంటనే భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
మత్తుపదార్థాల రవాణాపై రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్ విభాగాలు ఇప్పటికే పట్టు బిగిస్తున్నాయి. రాష్ట్రంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్న అన్ని మార్గాల్లో పటిష్ఠమైన నిఘా పెడుతున్నాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ర్టాలకు తరలుతున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ నిఘా మరింత పెంచేలా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొన్నది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర పోలీస్ విభాగాన్ని మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో, నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని తీర్మానించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని హోంశాఖను క్యాబినెట్ ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలను మరింత మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.