Congress | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి మళ్లీ రాజుకుంది. నామినేటెడ్ పోస్టులు పార్టీ నేతల్లో చిచ్చురేపాయి. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ప్రభుత్వం అనధికారికంగా విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితా కొందరికి మోదం కలిగిస్తే మరికొందరికి ఖేదం మిగిల్చింది. తమ సేవలను కార్పొరేషన్ పదవులకు పరిమితం చేసేశారని కొందరు, ప్రాధాన్యం లేని పదవులు కట్టబెట్టారని మరికొందరు రగిలిపోతున్నారు. ఒకరిద్దరు నేతలు పదవిని తిరస్కరించినట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత శనివారం రాత్రి కార్పొరేషన్ పదవుల పంపకంపై కాంగ్రెస్ నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ నెల 14నే 37 మంది నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చారని, దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని మీడియా సంస్థలకు 16న రాత్రి అనధికారికంగా ఓ జాబితాను పంపారు. సాంకేతిక కారణాల కారణంగానే జీవో ఇవ్వలేదని పేర్కొన్నారు. పదవులు దక్కిన కొందరికి పార్టీ నేతలు, మంత్రులు స్వయంగా ఫోన్ చేసి చెప్పగా, మరికొందరు మీడియా ద్వారా తెలుసుకోవడం గమనార్హం.
ఎమ్మెల్సీ లేదంటే ఎంపీ టికెట్ వస్తుందని ఆశించిన నేతల పేర్లు కార్పొరేషన్ పదవుల జాబితాలో కనిపించడంతో వారంతా అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్రెడ్డి, లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ టికెట్ ఆశించారు. అదీ కుదరకుంటే ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరారు. ఆయన ఆశలన్నీ తలకిందులయ్యాయి. తనను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమించినట్టు జాబితా చూసి తెలుసుకుని లబోదిబోమంటున్నారు. లోక్సభకు పోటీచేయాలని పట్టుదలగా ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కే శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పదేండ్లు పనిచేశానని, మరో ఐదేండ్లు కూడా పనిచేయడానికి సిద్ధమని, కానీ ఈ పదవిని మాత్రం తీసుకునే ప్రసక్తే లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. తన ఆసక్తికి అది సరిపడదని, కనీసం సివిల్ సైప్లె కార్పొరేషన్ పదవి ఇచ్చినా బాగుండేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం మొదటి నుంచీ పనిచేస్తున్న జావెద్కు కార్పొరేషన్ పదవుల్లో చోటు దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు. ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆ తర్వాత తుమ్మల పార్టీలో చేరడంతో జావెద్ తన స్థానాన్ని త్యాగం చేశారు. కార్పొరేషన్ పదవుల ద్వారా అయినా గౌరవిస్తారనుకుంటే అక్కడా నిరాశే మిగిలింది. జావెద్కు పదవి లభించకపోవడంపై ఖమ్మంలో మైనార్టీలు ఆదివారం నిరసన తెలిపారు. పొంగులేటి, తుమ్మల కలిసి జిల్లాలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వర్గపోరు చల్లారడం లేదు.జావెద్ను పదవి వరించకపోవడానికి ఇదే కారణమని చెప్తున్నారు. పార్టీకి తొలి నుంచి అండగా ఉన్న జావెద్కు కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన అనుచరుడు మొవ్వ విజయబాబుకు విద్య, మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ పదవిని ఇప్పించుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి వర్గానికి ఇది రుచించడం లేదు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే వర్గ నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనిషిగా పేరున్న నాయుడు సత్యనారాయణకు ఎలాంటి ప్రాధాన్యం లేని హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడం భట్టికి రుచించడం లేదు. జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ వారికి పదవులు ఇప్పించుకోగలిగినా, సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి మాత్రం నిరాశే మిగిలింది. ఆయనను నమ్ముకొని పార్టీలో చేరిన సాదు రమేశ్రెడ్డి, కమర్తపు మురళి, బాలసాని లక్ష్మీనారాయణ వంటివారు ఏదో ఒక కార్పొరేషన్ పదవి రాకపోతుందా అని ఎదురు చూశారు. శనివారం జిల్లాకు మొత్తం 5 కార్పొరేషన్ పదవులు ఇస్తే మంత్రి తుమ్మల వర్గానికి చెందిన వారిలో ఒక్కరికి కూడా పదవి రాలేదు. ఇది ఆయన వర్గాన్ని నిరాశలోకి నెట్టేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ టికెట్ ఆశించి భంగపడిన కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైన ఏనుగు రవీందర్రెడ్డి వర్గాన్ని ఇది తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తన ఓటమి కారణమైన బాలరాజుకు పదవి ఇచ్చి తనను విస్మరించడంపై రవీందర్రెడ్డి తన ఆత్మీయుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చిన గిరిధర్రెడ్డి పార్టీకి చేసిన సేవలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సామ రామ్మోహన్రెడ్డి వంటివారికి ఆ పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీకి ఎలాంటి సేవ చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన అనుచరుడు ఎంఏ ఫహీంకు పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం మీడియాకు ఇచ్చిన లీకులో మొత్తం 37 కార్పొరేషన్ల పదవులను భర్తీచేసినట్టు చెప్పగా ఆయా పదవుల్లో 13 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దగా ప్రాధాన్యం కార్పొరేషన్లు కట్టబెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం శనివారం రాత్రి లీకు ఇచ్చిన 37 కార్పొరేషన్ పోస్టులు భర్తీచేసినట్టు చెప్తున్నప్పటికీ జీవోలు ఇవ్వకపోవడంపై నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ నేతల్లో అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకే ఈ ఉత్తుత్తి పదవులు కట్టబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. నిజంగానే పదవులు ఇచ్చి ఉంటే జీవో ఇచ్చి ఉండేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ లేకపోవడం చూస్తుంటే ఉత్త ముచ్చటలానే ఉన్నదని అంటున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా కార్పొరేషన్ పదవులపై మాట్లాడకపోవడం అనుమానులకు తావిస్తున్నదని చెప్పుకుంటున్నారు.
కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మాలలకు, మాల ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నామ సైదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మాల కులస్తులకు ఒక చైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆదివారం ఓయూలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ కులాలకు చెందిన ఒక్కరికి కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. గత కేసీఆర్ సర్కార్ మాలలకు కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మాలలకు న్యాయం చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మాలలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పుతామని ఆయన హెచ్చరించారు.