తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ ఆమోదం
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బెస్ట్ కింద రూ. 6.01 కోట్లను సబ్సిడీ రూపంలో సాయం చేసేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వహణ కమిటీ ఆమోదించింది. శుక్రవారం నగరంలో బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ కమిషనరేట్లో పరిషత్తు అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. బెస్ట్ పథకం కింద ఎంపికైన 182 మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది.
75 ఏండ్లు పైబడిన వేద,శాస్త్ర పండితుడు శ్రీనివాసుల జనార్ధనాచార్యులకు ప్రతి నెలా రూ. 2,500 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిర్మాణదశలో ఉన్న సద్గురు సదనానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. సమావేశంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వేణుగోపాలచారి, పురాణం సతీశ్, డాక్టర్ సువర్ణ సులోచన పాల్గొన్నారు.