హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ): తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గ్రేటర్ బీజేపీలో సీట్ల కేటాయింపు ప్రక్రియ వీరి మధ్య చిచ్చు రాజేసింది. ఎవరికి వారు తమ వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు పార్టీ నిబంధనలను సైతం తోసిరాజంటున్నారు. ఈ పోరులో బండి కాస్తంత వెనకబడినట్టు తెలుస్తున్నది.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తీవ్రంగా శ్రమించిన బండిని అదే గ్రేటర్లో ఆయన పాత్రను నామమాత్రం చేయాలని డీకే వర్గం కంకణం కట్టుకున్నట్టు సమాచారం. బండి ఇటీవల తన అనుచరుడు చికోటి ప్రవీణ్ కుమార్ని పార్టీలోకి ఆహ్వానిస్తే కిషన్రెడ్డి అడ్డుతగిలారు. ఇలాగైతే లాభం లేదని భావించిన చికోటి.. అరుణ ద్వారా రాయబారం నడిపి ఆమె సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ విషయంలో బండిపై అరుణ పైచేయి సాధించినట్టు అయింది. తాజాగా ఇప్పుడు వీరిద్దరి మధ్య గోషామహల్ సీటు అగ్గిరాజేసింది. రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ సీటును మళ్లీ ఆయనకే కేటాయించాలని బండి సంజయ్ కోరుతుండగా, ఆ స్థానాన్ని విక్రమ్గౌడ్కు ఇప్పించాలని అరుణ పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో కిషన్రెడ్డి కూడా ఆమెవైపే నిలబడినట్టు సమాచారం. అంతేకాదు, గోషామహల్ నుంచి బరిలోకి దిగేది తానేనని, బీజేపీ పెద్దల నుంచి హామీ కూడా వచ్చిందని విక్రమ్గౌడ్ చెప్పుకుంటున్నారట.
గ్రేటర్ పరిధిలోని మిగతా నియోజకవర్గాల సంగతి అటుంచితే.. ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిస్థితి భిన్నంగా ఉంది. రాజాసింగ్ తనపై ఉన్న వేటును ఎలాగైనా తొలగించుకుని గోషామహల్ నుంచి పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఆ సీటుపై బండి సంజయ్ హామీ కూడా ఇచ్చారని రాజాసింగ్ అనుచరులు చెప్పుకుంటున్నా, టికెట్లు కేటాయించే సమయం దగ్గరపడినా సస్పెన్షన్ కొనసాగుతుండడంతో బండి వర్గంపై డీకే అరుణ వర్గం పైచేయి సాధించినట్టు అయింది. ఖైరతాబాద్ నుంచి ఈసారి చింతల రామచంద్రారెడ్డికి బదులు అదే పార్టీ కార్పొరేటర్కి ఇచ్చేందుకు మరో అగ్రనాయకుడు పట్టుబడుతున్నట్టు తెలిసింది. ముషీరాబాద్ నుంచి దత్తాత్రేయ, లక్ష్మణ్ ఎవరికి వారే తమవారికి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో ఆధిపత్య పోరుకు దిగారు. ఇలా ఈ మూడు స్థానాలు సొంత పార్టీ నాయకుల మధ్య విభేదాలకు ఆజ్యం పోశాయి.