హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి.. గుగ్గిల్ల గ్రామ శివారులోని రైస్మిల్లులో మీడియాతో మాట్లాడారు. మార్చి 31లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పథకాన్ని అమలుచేసి ప్రతి నియోజకవర్గంలోని వందమంది దళితులకు లబ్ధి చేకూరేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యాయని వివరించారు. దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించి దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేయించాలని సవాల్ విసిరారు. ఓట్ల రాజకీయం చేస్తూ అధికారమే లక్ష్యంగా వికటానందంతో విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరని బీజేపీపై విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో దళితబంధుకు రూ.2 లక్షల కోట్లు కేటాయించేలా ఒప్పించాలని రాష్ట్ర బీజేపీ నేతలను హరీశ్రావు డిమాండ్చేశారు.