నీతి ఆయోగ్ నివేదికలో కేరళకు తొలి స్థానం
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు 7వ స్థానం
కేసీఆర్ ముందుచూపుతో విద్యుత్తు వెలుగులు
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హర్షం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ జాతీయ స్థాయిలో మరో రికార్డు సాధించింది. విశ్వసనీయత, లభ్యత, ధర.. ఈ మూడు అంశాల్లో దేశంలోనే ద్వితీయ స్థానానికి ఎగబాకింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ తాజాగా విడుదల చేసిన రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్తు, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగ్లో కేరళ మొదటి స్థానం సాధించగా, తెలంగాణ రెండో స్థానం దక్కించుకొన్నది. ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేసే నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ 7వ స్థానంలో ఉండగా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ 21వ స్థానానికి పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంతో సరిపెట్టుకొన్నది. విశ్వసనీయత, లభ్యత, ధర అంశాల ఆధారంగా రూపొందించిన ర్యాంక్ల్లో కేరళ 67.3, తెలంగాణ 60.4 పాయింట్లు సాధించాయి. మూడో స్థానంలో నిలిచిన ఒడిశా 57.4 పాయింట్లు పొందింది.
అభివృద్ధికి ఐకాన్గా ప్రచారం చేసుకొనే గుజరాత్ సాధించింది 52.4 పాయింట్లే! తెలంగాణ వస్తే అంధకారం తప్పదని వెక్కిరించిన వారికి రాష్ట్రం ఏర్పడిన తొలి ఆర్నెళ్లలోనే కోతల్లేని విద్యుత్తుతో సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికీ అవాకులు, చెవాకులు పేలుతున్న నోళ్లకు నీతి ఆయోగ్ నివేదికే జవాబు చెప్పినట్టయ్యింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తను సరఫరా చేయడం, కరెంటు కోతలు, పవర్ హాలిడేలు లేకపోవడంతో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఇతర రాష్ర్టాలతో పోల్చుకొంటే తెలంగాణలో వినియోగదారులకు విద్యుత్తు చౌకగా లభిస్తున్నది. కేరళలో పవన, సౌర, జల విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో అత్యధిక శాతం థర్మల్ విద్యుత్తు, ఆ తరువాత సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. అయినప్పటికీ, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్తు అందిస్తుండటం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, విద్యుత్తు రంగానికి అందించిన ప్రోత్సాహం కారణంగా రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 9,470 మెగావాట్ల నుంచి 17,218 మెగావాట్లకు పెరిగింది. కోతలు లేని నాణ్యమైన విద్యుత్తు లభిస్తుండటంతో పారిశ్రామిక, వాణిజ్యరంగాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒకనాడు సర్కార్ తుమ్మలు మొలిచిన భూముల్లో నేడు బంగారుపంటలు పండుతున్నాయి.
కేసీఆర్ విజన్కు నిదర్శనం: వినోద్కుమార్
విద్యుత్తురంగంలో విశ్వసనీయత, లభ్యత, ధరల ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణకు రెండో స్థానం లభించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ కన్నా, తెలంగాణ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యుత్తు రంగం పట్ల ఉన్న విజన్, ముందుచూపు, పనితీరుకు నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతున్నదని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అగమ్యగోచరంగా ఉన్న విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాను స్వరాష్ట్రంలో మెరుగుపర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్తు సరఫరా వల్ల రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.