Telangana | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ను అందిచండంలోనేకాక విద్యుత్తు ఆదాలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్'(ఈసీబీసీ) విధానంపై నీతి అయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ విధానం ద్వారా గడిచిన మూ డేండ్ల కాలంలో వ్యాపార సముదాయాల్లో 336 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేసిందని ప్రశంసించింది. ఈ మేరకు సోమవారం నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చేపట్టిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ విధానాన్ని దేశంలో బెస్ట్ ప్రాక్టీసింగ్ విభాగంలోఎంపిక చేసింది. తక్కువ విద్యుత్తు వినియోగం అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కమర్షియల్ భవనాలను నిర్మించేలా ఈసీబీసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి కమర్షియల్ భవన నిర్మాణంలో ఈసీబీసీ నిబంధనల అమలును తప్పనిసరి చేస్తూ 2014లోనే జీవో నెంబర్ 30కి సవరణ చేసింది.
2019లో దీనిని మున్సిపల్ చట్టంలో పొందుపరిచింది. దేశంలోనే తక్కువ విద్యుత్తు వినియోగం చేసేలా ఈసీబీసీ విధానాన్ని తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సాధారణ భవనాలతో పోలిస్తే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ విధానాలను పాటించడం ద్వారా 40 నుంచి 60 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. భవనాల నిర్మాణ సమయంలోనే.. ఈసీబీసీ నిబంధనలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒక థర్డ్ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తెలంగాణ రెడో పర్యవేక్షించింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా 430 కమర్షియల్ బిల్డింగులు నిర్మితమయ్యాయి. ఈసీబీసీ నిబంధన ప్రకారం నిర్మితమైన భవనాల సంఖ్య ప్రస్తుతం 630కి (2023 ఏప్రిల్నాటికి) పెరిగింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాతావరణ కాలుష్యం కూడా తగ్గింది. అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ కృషిని గుర్తించి నిరుడు నవంబర్లో జాతీయస్థాయిలో రెండో అవార్డును అందజేసింది.
ఈసీబీసీ విధానాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడం, దేశంలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి దక్కిన ఫలితమే నీతి ఆయోగ్ ప్రశంసలు. మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ఈసీబీసీ విధానాన్ని అమలు చేసిన తెలంగాణ రాష్ట్రం ఈ ఘనతను సాధించింది. ప్రత్యేక శ్రద్ధతో ఈసీబీసీని మున్సిపల్ యాక్ట్లో పొందుపరిచిన కేటీఆర్కు నా కృతజ్ఞతలు. విద్యుత్తు పొదుపులో భాగంగా తాజాగా దేశంలోనే మొదటిసారిగా కూల్ రూఫ్ పాలసీని కేటీఆర్ ప్రకటించారు. ఇంధన పొదుపులో భాగంగా రెడ్కో ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, సూళ్లు, ప్రార్థనా స్థలాల్లో ఎల్ఈడీ లైట్లు, బీఎల్డీసీ ఫ్యాన్లను ఉచితంగా బిగిస్తున్నాం. స్వయంగా రెడో సంస్థ నూతన భవనాన్ని కూడా పూర్తిగా ఇంధన పరిరక్షణ విధానాలతో నిర్మిస్తున్నాం. -వై సతీశ్రెడ్డి, రెడ్కో చైర్మన్