Telangana | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అవయదానంలో దేశానికి మరోసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. 2022 సంవత్సరంలో మరణించిన (బ్రెయిన్ డెడ్) వారి అవయవాలను దానం చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ క్యాటగిరీలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల్లోనూ టాప్లో నిలిచింది. దీనికి గుర్తింపుగా కేంద్రం తెలంగాణకు ‘స్టేట్ విత్ హయ్యస్ట్ నంబర్ ఆఫ్ డిసీజ్డ్ డోనర్స్’ అవార్డును ప్రకటించింది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్వోటీటీవో) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరగనున్న 13వ జాతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో రాష్ర్టానికి అవార్డు బహూకరించనున్నారు. అవయదానంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడంపై మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
అవయవదానాలు రెండు రకాలుగా ఉంటాయి. బ్రెయిన్డెడ్ అయిన తర్వాత కుటుంబసభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో అవసరం ఉన్నవారికి ఒక కిడ్నీ లేదా లివర్లో కొంత భాగం రక్త సంబంధీకులు దానం చేస్తారు. దీనిని లైవ్ డొనేషన్ అంటారు. రాష్ట్రంలో అవయవ దానానికి ‘జీవన్ దాన్’ పోర్టల్ నోడల్ ఏజెన్సీగా ఉన్నది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నది. సీనియారిటీ ప్రకారమే అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి.