హైదరాబాద్: మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minsiter Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశిశు మరణాల సంఖ్య (Maternal Mortality rate) బాగా తగ్గిందని తెలిపారు. హైదరాబాద్ గాంధీ దవాఖానలో ఎంసీహెచ్ బ్లాక్, 33 నియోనేటల్ అంబులెన్సులను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సూపర్ స్పెషాలిటీ తరహాలో 200 పడకలతో రూపుదిద్దుకున్న ఎంసీహెచ్ బ్లాక్ను (MCH Block) ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిమ్స్, టిమ్స్లో కూడా మరో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
గాంధీ హాస్పిటల్లో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో గర్భిణులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసమే దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఫెసిలిటీ తొలిసారిగా తెలంగాణలోనే ఏర్పాటయిందన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే చిన్నారుల కోసం నియోనేటల్ అబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ అంబులెన్సులు అన్ని జిల్లాల్లో ఉంటాయని, అన్నిరకాల సదుపాయాలు ఉంటాయని చెప్పారు. ఈ అంబులెన్సుల ద్వారా శిశు మరణాలు తగ్గించవచ్చని వెల్లడించారు.