హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చర్చ ప్రారంభించింది. దాంతో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి రెండు నిమిషాల్లోనే చర్చ మొదలుపెడితే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు.
ముందురోజే నోట్ ఇస్తే తాము ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉండేదని అన్నారు. నోట్ చదివేందుకు కనీసం ఒక గంట టీ బ్రేక్ అయినా ఇవ్వాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. నోట్ ప్రిపేర్ అయ్యేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో సభ్యులు తామిచ్చిన నోట్పై ప్రిపేర్ అయ్యేందుకు టీ బ్రేక్కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. దాంతో స్పీకర్ టీ బ్రేక్ ప్రకటిస్తూ సభను అరగంట వాయిదా వేశారు.