హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీరి పీఏలు, ఇతర సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. అసెంబ్లీ ఆవరణలో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ ఉన్నతాధికారులతో శనివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి రాష్ట్ర రెండో శాసనసభ 8వ సెషన్, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. గత సమావేశాలు సజావుగా జరుగడానికి సహకరించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గత సమావేశాల్లో మాదిరిగానే అధికారులు సహకారం అందించాలని కోరారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు.
గత సమావేశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని సూచించారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ అధికారులు కరోనా టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారు పూర్తి సహాయ, సహకారాలను అందించాలని కోరారు.