హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంట్ సీట్లను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగనున్నాయి. అసెంబ్లీ సీట్లను సాధారణంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కి పెరిగే అవకాశం ఉన్నది.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచుకునే వెసులుబాటు ఉన్నది. కానీ, గత 12 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయలేదు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచలేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నది. నూతన ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కి పెరిగే అవకాశం ఉన్నది. కానీ, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపును రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం చేస్తారా? లేక నూతన చట్టం ప్రకారం చేస్తారా? అనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.