Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 10.
13న స్క్రూట్నీ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను (Polling Stations) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 27,798 కేంద్రాల్లో (78 శాతం) వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇక 597 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా 644 మోడల్ కేంద్రాలు, మరో 120 పోలింగ్ కేంద్రాలను వికలాంగుల కోసం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మందికి ఓటు హక్కు ఉన్నదని సీఈసీ తెలిపారు. వారిలో 1.58 కోట్ల మంది పురుషులు ఉండగా, 1.58 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. ఇక 8.11 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని చెప్పారు.