హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఈ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం 70వ సెక్షన్లోని సబ్ సెక్షన్-3ని తాజాగా ప్రభుత్వం సవరించింది. కొత్త సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని సమీపంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసుకునేలా చట్ట సవరణ చేశారు. ప్రస్తుతం సొంత ఆదాయాన్ని ట్రెజరీల్లోనే జమ చేస్తున్నారు. దీంతో గ్రామ అవసరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలంటే ట్రెజరీ ద్వారా డ్రా చేసుకోవాల్సి వస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం -2018 సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గురువారం మధ్యాహ్నం మండలి విరామం అనంతరం ప్రారంభం కాగానే మంత్రి సీతక్క ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎలాంటి సవరణలు లేకుండానే సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు.
గజ్వేల్, సెప్టెంబర్ 10: పసుపు నీటితో రోడ్లను శుద్ధి చేసిన ఘటనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్టు గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న మర్కూక్ మండల పరిధిలోని వర్ధరాజ్పూర్, ఎర్రవల్లి వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం అనంతరం కొంతమంది పసుపు నీటితో ఆయా ప్రదేశాలను శుభ్రం చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మర్కూక్ స్టేషన్లో ఎర్రవల్లికి చెందిన మొండి స్వామి, వర్ధరాజ్పూర్కు చెందిన బొల్లారం శ్రీకాంత్, వర్గల్కు బాగనుల మోహన్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు సీఐ వెల్లడించారు.