హైదరాబాద్: ఉభయ సభలు సోమవారానికి సోమవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు శాసన సభ, మండలి సమావేశమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. సంతాప తీర్మానాల అనంతరం శాసన సభ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి.
ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు సభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు.
అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.