KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయం, ఐటీ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. లండన్లోని భారత హై కమిషనర్ విక్రం కే దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమావేశానికి హాజరైన కంపెనీల ప్రతినిధులు తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలపై వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటిపైన దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన తదితర అంశాలపై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానంపై ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ఈ విధానం ఇప్పటికే అనేక ప్రశంసలను అందుకుందని, ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్టైల్ వంటి రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్ ఈకో సిస్టం, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్ లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు వలన ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో చేసుకున్న భాగస్వామ్యాల ఏర్పాటుకు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు రావాలని కోరిన కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ముందుకు వచ్చి సంస్థలకు సహకరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన అద్భుతమైన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త కరెంట్ బిల్లీమోరియా ప్రస్తావించారు.
ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ కే దురై స్వామి ఏవియేషన్, డిఫెన్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యూకే కంపెనీలతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, విభిన్న సంసృతుల సమ్మేళనమైన పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక అద్భుతమైన గమ్యస్థానమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన నూతన సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం వంటి వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.