హనుమకొండ/పాల్వంచ/ మధిర, ఏప్రిల్ 10: ఆర్టిజన్ల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విద్యుత్తు సంస్థలు నానా రకాలుగా కార్మికులకు బెదిరింపులకు గురిచేస్తున్నది. అయినప్పటికీ కార్మికులు బెదరకుండా మూడో రోజైన శుక్రవారం కూడా సమ్మెను కొనసాగించారు. కార్మికుల వాట్సాప్లో సస్పెన్షన్ ఉత్తర్వులు పంపడంపై భగ్గుమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 11 డివిజన్ల పరిధిలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్, పీస్ రేట్ వర్కర్లు, బిల్కలెక్టర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. వీరి సమ్మెకు అన్ని ట్రేడ్ యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలిపాయి. హనుమకొండ నక్కలగుట్టలోని సర్కిల్ ఆఫీసు ఆవరణలో చేపట్టిన ఆందోళనలో 1104 యూనియన్ కార్యదర్శి రమణారావు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను వెంటనే చర్చలకు పిలువాలని డిమాండ్ చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే పరిషరించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) ఎదుట తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిషరించాల్సిన యాజమాన్యం బెదిరింపులకు దిగుతున్నదని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, పలువురు కార్మికులకు వాట్సాప్ ద్వారా సస్పెన్షన్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ధర్నా శిబిరాన్ని పలు పార్టీలు, సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఆర్టిజన్లు విధులను బహిష్కరించి పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో సమ్మెలో పాల్గొన్నారు. వీరి సమ్మెకు బీఆర్ఎస్, సీపీఐ కార్పొరేటర్లు, నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మధిర డివిజన్లో చేపట్టిన సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్తు శాఖలోని ప్రధాన కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి.