తాడ్వాయిలో అంత్యక్రియలు పూర్తి
తాడ్వాయి, సెప్టెంబర్ 4: జమ్ము కశ్మీర్లో విధుల నిర్వహణకు వెళ్లి, అస్వస్థతతో మృతి చెందిన కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన ఆర్మీ జవాన్ జవుడి రవీందర్రెడ్డి(28)కి అశ్రునయనాల మధ్య కడపటి వీడ్కోలు పలికారు. శుక్రవారం ఆయన చండీగఢ్ ఆర్మీ దవాఖానలో మృతి చెందారు. ఎనిమిదేండ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న రవీందర్రెడ్డి రెండు నెలల క్రితమే జమ్ము కశ్మీర్ వెళ్లారు. మెదడులో నీరు చేరి, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు చండీగఢ్ ఆర్మీ దవాఖానలో శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ ఫలితం దక్కలేదు. కోమాలోకి వెళ్లి, మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. రవీందర్రెడ్డి అంత్యక్రియల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.