రవీంద్రభారతి, జూలై 4: గొల్లకురుమలు విద్య ద్వారానే రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ, విశిష్ట అతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హాజరయ్యారు. దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటయోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య తెలంగాణ జాతిరత్నాలని కొనియాడారు. వీరి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బండా ప్రకాశ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య పోరాట పటిమ, ఉద్యమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయంగా నిలుస్తాయని చెప్పారు. తెలంగాణ పోరాటయోధుల చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని, సీఎం కేసీఆర్ ఆ మహనీయుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. యెగ్గె మల్లేశం మాట్లాడుతూ.. కురుమలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే తగిన గుర్తింపు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లయ్యయాదవ్, జైపాల్యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేంద్రచారి, కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, క్యామ మల్లేశం, కురుమ సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు తూం కుంట అరుణ్కుమార్ పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య త్యాగం గొప్పది: బండా ప్రకాశ్
రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య త్యాగం గొప్పదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ లాంజ్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బం డా ప్రకాశ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభలో చురుకైన నాయకుడిగా కొమురయ్య ఎదిగార ని, రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డికొమురయ్య నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి పాల్గొన్నారు.