హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) పేరుతో దేశంలోనే తొలి మొబిలిటీ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో తెలంగాణలోకి రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘మొబిలిటీ నెక్స్ హైదరాబరాద్ సమ్మిట్-2023’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 4 మెగా క్లస్టర్లను (జహీరాబాద్, సీతారాంపూర్లో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ క్లస్టర్, యంకతలలో ఇన్నోవేషన్ క్లస్టర్) అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక టెస్టిం గ్ ల్యాబ్లను కలిగి ఉండే ఈ క్లస్టర్లలో ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు లిథియం అయాన్ బ్యాటరీలు, విడిభాగాలను తయారు చేయనున్నట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జర్మనీకి చెందిన ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ ఏటీఎస్-టీయూవీతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నదని, ఆ కంపెనీ రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని చెప్పారు.
దేశానికే ఆదర్శం
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలోని యంకతల గ్రామంలో 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్, అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ కార్యకలాపాలు జరిగే ఈ వ్యాలీలోకి రానున్న 2-3 వారాల్లో దాదాపు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ నగరమైన హైదరాబాద్లో మొబిలిటీ నెక్స్ సమ్మిట్ను నిర్వహించడం హర్షణీయమన్నారు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, వీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ-మొబిలిటీ వీక్ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
దీనిలో భాగంగానే తొలిసారి హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ను, గ్రాండ్ స్టార్ట్-అప్ చాలెంజ్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్లో హైదరాబాద్ వేగంగా పరుగు తీస్తున్నదని తెలిపారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని మంత్రి కేటీర్ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్తులో సౌర విద్యుత్తు వాటా దాదాపు 20% మేరకు ఉన్నదని చెప్పారు. తెలంగాణలో ఈవీ సంస్థలను నెలకొల్పేవారిని రాష్ట్ర ప్రభుత్వం సాదరంగా ఆహ్వానిస్తున్నదని, వినూత్న ఆలోచనలతో స్టార్టప్స్ ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు దేశ, విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పారు.
ఒలెక్ట్రా, మైత్రా, గ్రాఫ్టన్, ప్యూర్ ఈవీ, వన్ మోటో తదితర ప్రఖ్యాత సంస్థల నుంచి రాష్ట్రం ఇప్పటికే రూ.8 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించిందని, అమరరాజా గ్రూప్, హ్యుందాయ్ లాంటి పలు కంపెనీలు తెలంగాణలో తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించి దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. బిట్స్ హైదరాబాద్, బాష్ సహకారంతో ఏర్పాటయ్యే ఈ సెంటర్ వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ నమూనాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ప్రభుత్వంతో పలు కంపెనీల ఒప్పందాలు
తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆటోమేటివ్ టెస్ట్ సిస్టం (ఏటీఎస్) ఎండీ ఎస్ రామనాథన్, టీయూవీ వైస్ప్రెసిడెంట్ రాజేందర్ బండాల్ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం బీజీఎస్డబ్ల్యూ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీం మెంబర్ ఆర్కే షినాయ్, ప్రొఫెసర్ సుందర్ (బిట్స్పిలానీ డైరెక్టర్), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, కార్పొరేట్ రిలేషన్స్ విభాగం అధిపతి వికాస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
టీఎస్ఈవీ యాప్ ఆవిష్కరణ
గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటైన 150 ఈవీ చార్జింగ్ కేంద్రాల సమాచారాన్నంతా ఒక్క క్లిక్తో అందుబాటులోకి తెచ్చే ‘టీఎస్ఈవీ’ యాప్ను రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు దగ్గరలో ఉన్న కేంద్రం ఏది? అక్కడ వాహన చార్జింగ్కు ఎంత చెల్లించాలి? తదితర వివరాలన్నీ ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ కమల్బాలి, చీఫ్ బిజినెస్ గ్రోత్ ఆఫీసర్ మమతా చామర్తి తదితరులు పాల్గొన్నారు.
క్లీన్ ఎనర్జీ హబ్గా తెలంగాణ ;ఉబర్ ఈ-మొబిలిటీ బోర్డ్ రూంలో మంత్రి కేటీఆర్
దేశంలో క్లీన్ ఎనర్జీ హబ్గా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బహుళ స్థాయి సహకారం అవసరమని ఉద్ఘాటించారు. ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ సోమవారం నిర్వహించిన ‘ఈ-మొబిలిటీ బోర్డ్ రూం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడం, అందులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ఈవీ రంగ వృద్ధికి పన్ను మినహాయింపు, క్యాపిటల్ ఇన్సెంటివ్స్, సబ్సిడీ తదితర ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు వివరించారు. మొబిలిటీ కంపెనీలకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారానికి ఉబర్ చొరవ చూపడం హర్షణీయమన్నారు. 2040 నాటికి జీరో ఎమిషన్ ప్లాట్ఫామ్గా ఎదిగేందుకు తమ సంస్థ కట్టుబడి ఉన్నదని ఉబర్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ప్రబ్జిత్ సింగ్ తెలిపారు. కార్యక్రమంలో వోల్వో ఇండియా ప్రెసిడెంట్ కమల్బాలి, బౌన్స్ ఇన్ఫినిటీ సీఈవో వివేకానంద హాలేకర్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడుల వరద