హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం.. సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా.. కేంద్రం నుంచి మాత్రం సహకారం అందడం లేదని ఆయన వాపోయారు.
ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ సెక్టార్లో అంతర్జాతీయ స్థాయి సంస్థగా ఉన్న డ్రిల్మెక్స్పా హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకాలాపాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నది. ఇటలీకి చెందిన డ్రిల్మెక్ స్పా ఆయిల్ డ్రిలింగ్, రిగ్గింగ్ సెక్టార్ ఎక్విప్మెంట్ తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, డ్రిల్మెక్స్పా సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో రూ.15 వందల కోట్ల పెట్టుబడులతో డ్రిల్మెక్స్పా ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందన్న కేటీఆర్ 80శాతం వరకు స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని హైదరాబాద్లో డ్రిల్మెక్ స్పా సంస్థ తమ యూనిట్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఏడున్నరేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్గా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి మాత్రం సహకారం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కేంద్రానికి సూచించారు. తెలంగాణలోని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రత్యేక రాయితీలు అందించాలని కోరారు. ప్రధాని మోదీ పదేపదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారని, రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమని, హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని కేటీఆర్ తేల్చిచెప్పారు.